గిరిజ‌న విద్యార్థుల‌పై ప్ర‌భుత్వం క‌ప‌ట ప్రేమ‌

“గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కాగజ్‌నగర్‌లోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆక‌స్మికంగా సందర్శించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా RO వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం.. గదుల్లో కిటికీలకు తలుపులు లేక దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివరకు విద్యార్థులకు దుస్తులు కూడా అందించలేని పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.”

కాగజ్‌నగర్‌లోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆక‌స్మికంగా సందర్శించారు. ఈ సంద‌ర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏడు నెలలుగా RO వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా వెంటనే వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా.. విద్యార్థులు ఉంటున్న గదుల్లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో దోమల బెడద ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి వచ్చింది. కనీస వసతులు కల్పించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు.. విద్యార్థులకు ఇప్పటివరకు దుస్తులు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని హరీష్‌రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.

గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి కల్పిస్తామని చెప్పే ప్రభుత్వం.. కనీస అవసరాలను కూడా తీర్చడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించి.. ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని తన్నీరు హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెంట ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోన‌ప్ప‌, న‌డిపెల్లి దివాక‌ర్ రావు, బీఆర్ఎస్ నేత ప్ర‌వీణ్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

You might also like