ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల సమరశంఖం
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం రాజుకుంది. ఏకంగా ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేతలు సమరశంఖం పూరించారు. గతంలోనే ఆయనపై అసమ్మతి గళం వినిపించినా పట్టించుకోవడం లేదని, తాము అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యవహారశైలిపై పార్టీ సీనియర్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు, వినోద్ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకొని, కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం నిలబడ్డ అసలైన నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాలని సూచించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని, అందరినీ సమన్వయం చేసుకోకపోతే పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే తీరుపై నేరుగా ఫిర్యాదు చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిప్ప మనోహర్, మాజీ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, మాజీ కౌన్సిలర్ బొడ్డు నారాయణలతో పాటు మునిమంద రమేష్, నయీం, రొడ్డ శ్యామ్, ఎండీ గౌస్, జక్కుల శ్రీధర్, సిలివేరి సత్యనారాయణ, సూరం బానేష్, మేకల శ్రీనివాస్, మత్తమరి సత్తిబాబు, మంగమూర్తి, దాసరి సంజీవ్, మత్తమరి జగన్, బైరి శ్రీనివాస్, మత్తమరి శ్రీనివాస్, రాజబ్రహ్మం, గడ్డం అశోక్, కళ్యాణం పోషం, అజీమ్ భాయ్, ఎండీ రహీం, హరీష్ పాండే, బబ్లు భాయ్, ఆర్.ఎం. సింగ్, నక్క కృష్ణ, రాజారత్నం, చిన్న జీలకర్ర వాసు, సబ్బని రాజనర్సు, టి.ఎల్. చారి, జంజరాల మనోహర్, కుమ్మరి శంకర్, జూపాక లక్ష్మీనారాయణ, మల్లేష్, బాబురావు, సోగాల రవి, అంజయ్య పాల్గొన్నారు.