హార్దిక్ పాండ్యా… ఐదు కోట్ల వాచ్లు..

టీ20 ప్రపంచకప్-2021 ప్రదర్శనలో ఆట సరిగ్గా ఆడలేదు కానీ… వివాదాలకు మాత్రం తక్కువ లేకుండా చూసుకుంటున్నారు ఇండియా ఆటగాళ్లు.. భారత్ ఆటగాడు హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత యూఏఈ నుంచి భారత్కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. ఆ వాచీలకు సంబంధించిన ఇన్వాయిస్లు పాండ్యా చూపకపోవడంతో పాండ్యాను ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఖరీదైన బ్రాండ్లు..
హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం… ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..
క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈ ఘటనపై తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ శాఖకు తానే స్వయంగా వెళ్లానని, తాను తీసుకువచ్చిన ఐటమ్స్ గురించి కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు అక్కడకు వెళ్లినట్లు హార్ధిక్ తన ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. చట్టబద్దంగానే దుబాయ్లో వాచీలు కొన్నానని, వాటికి డ్యూటీ కస్టమ్ కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు క్రికెటర్ చెప్పాడు. కస్టమ్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు ఇచ్చానని, అధికారులు ఆ రసీదులను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. తాను తెచ్చిన వాచీ ఖరీదు 1.5 కోట్లు మాత్రమే అని, 5 కోట్లు కాదన్నాడు.
అయితే గత ఏడాది ఐపీఎల్ 2020 తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా అన్న కృనల్ పాండ్యా దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు బంగారం గుర్తించిన విషయం తెలిసిందే.