సింగరేణి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

- ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం - జీఎం(ఎడ్యుకేషన్) వెల్లడి

సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల కొత్తగూడెంలోని ఇటీవల బదిలీపై వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు పోలీసుల అదుపులో ఉన్నారని, తక్షణమే ఇతనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని జనరల్ మేనేజర్(ఎడ్యుకేషన్) బి.నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.

విచారణ తర్వాత ఆరోపణలు రుజువైతే తీవ్ర చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తి భరోసా ఇస్తున్నామని, ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సత్ప్రవర్తన లేని ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థుల భద్రతకు యాజమాన్యం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like