ధ్వంసమైన రైల్వే ట్రాక్..

భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లాకేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి.
తెలంగాణలో వర్షం దంచి కొడుతోంది. రెండురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ఒక్కసారిగా ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంటికన్నె- కేసముద్రం మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు సైతం పక్కకు ఒరిగాయి. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మహబూబాబాద్ శివారులోనూ రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో సమీప రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. అలాగే పలు రైళ్లను దారి మళ్లించారు. అదే విధంగా మంగనూరు ఎక్స్ ప్రెస్ ను కాజీపేటలో నిలిపివేశారు. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కు వరద తాకింది. పందిళ్లపల్లి వద్ద మహబూబ్ నగర్ – విశాఖ ఎక్స్ ప్రెస్ సుమారు 4 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ – కాజీపేట మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా–కావేరి, చార్మినర్, యశ్వంత్ పూర్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు.
విజయవాడ నుంచి సికింద్రాబాద్ వయా కాజీపేట మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తున్నారు. కాగా, ప్రయాణికులు సౌకర్యార్థం వివిధ స్టేషన్లలో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.