హెలికాప్టర్లు వినియోగించండి..

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి, అవసరమైతే హెలికాప్టర్లు వినియోగించాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ , సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెస్క్యూటీమ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని చెప్పారు. విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు సిబ్బంది 24 గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, విద్యుత్, తాగునీటికి, రాకపోకలకు అంతరాయాలు కలగుకుండా చూసుకోవాలన్నారు.