111 ఎకరాలు.. 262 అక్రమ నిర్మాణాలు..

Hydra : చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా, అక్రమ నిర్మాణలపై దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ నిర్మాలను కూల్చేవేసింది. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన పనులపై ప్రభుత్వానికి హైడ్రా ఓ నివేదికను సమర్పించింది. ఇందులో హైడ్రా చేపట్టిన వివరాలను పేర్కొంది. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
హైడ్రా గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు. నగరంలో కూల్చివేతలతో పాటు ఇళ్లు, ఫ్లాట్లు కొనేవారికి ఇటీవలే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన లుచేశారు. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.