వచ్చే నెల 9న లాభాల బోనస్ చెల్లింపు
-ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్సు
-ఒక్కొక్కరికి రూ.25 వేలు
-కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లింపుపై విధివిధానాలు
-అధికారులను ఆదేశించిన సంస్థ సీఎండీ బలరామ్

సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల వాటా వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఉదయం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి నికర లాభాలలో (33 శాతం) 796 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్ ప్రకటించారు.
ఒక్కొకరికి రూ. 1.90 లక్షలు..
సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తాము పనిచేసిన పని దినాల సంఖ్య పరిగణనలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు సుమారు లక్షా తొంభై వేల రూపాయల చొప్పున లాభాల వాటా పొందే అవకాశం ఉంది.
తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు..
సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లాభాల వాటా బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని సీఎండీ బలరామ్ ఆదేశించారు. కాంట్రాక్టర్ల వద్ద పనిచేసిన వారి వివరాలు, సమాచారాన్ని పూర్తిగా సేకరించాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
పండుగ అడ్వాన్సు– ఒక్కొక్కరికి రూ.25 వేలు
లాభాల వాటా బోనస్తో పాటు సింగరేణి ఎప్పటి లానే ఈ ఏడాది కూడా దసరా పండుగ అడ్వాన్స్ ఉద్యోగులకు చెల్లించాలని సీఎండీ ఆదేశించారు. ఒక్కొక్కరికి 25 వేల రూపాయల పండుగ అడ్వాన్స్ చెల్లించనున్నారు. దీని కోసం సంస్థ 95 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. సెప్టెంబరు నెల జీతాలతోపాటే ఈ పండుగ అడ్వాన్స్ సొమ్మును కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. లాభాల వాటా పండుగ అడ్వాన్సు కలిపి దాదాపు 900 కోట్ల రూపాయలను సింగరేణి ఉద్యోగులకు చెల్లించనున్న నేపథ్యంలో సింగరేణి సిబ్బంది వ్యవహారాలు, ఆర్థిక విభాగాలు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.