కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు తీసుకుకోకుండానే రికార్డుస్థాయిలో పంటలు
MLA Prem Sagar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు నుండి లీటరు నీటిని తీసుకోకుండానే కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో నష్ట పోయారని దుయ్యబట్టారు. ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక దోపిడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89 శాతం పూర్తి అయ్యిందన్నారు. కొంతమంది రైతుల ధ్రువ పత్రాలు సరిగా లేకపోవడంతో రుణమాఫీ కాలేదని, త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటివరకు 62 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామన్నారు. స్థానిక బిజెపి పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై 54 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతులను ఆదుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.