కేటీఆర్కు హైకోర్టులో ఊరట
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ను పది రోజుల వరకూ అరెస్ట్ చేయొద్దంటూ’ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈనెల 30 వరకూ వాయిదా వేసింది. అయితే విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఏసీబీ కేసుపై కేటీఆర్.. హైకోర్టులో లంచమోషన్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు. పిటీషన్ పై రెండు గంటలపాటు హూరా హెూరీ వాదనలు జరిగాయి. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు కొనసాగుతున్న వాదనల్లో కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదించగా, ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ తరఫున లాయర్ సుందరం తన వాదనలు వినిపిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఒకవేళ కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుందని తెలిపారు. నిధుల చెల్లింపునకు సంబంధించి పీసీ యాక్ట్ వర్తించదన్నారు. కేటీఆర్ లబ్ది జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. రేస్ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్పై కేసు ఎందుకు పెట్టారన్నారు. ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు.
నేరం జరిగిందని తెలిసిన మూడు నెలల్లోనే కేసు రిజిస్టర్ చేయాలని, కానీ, ఇక్కడ 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయాన్ని ఇక్కడ న్యాయవాది ప్రస్తావించారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టడమే కాకుండా, ఎలాంటి ఆలస్యం జరగలేదని ఎఫ్ఎస్ఐఆర్లో రాశారని చెప్పారు. 18న ఎంఏయూడీ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేస్తే 19న కేసు పెట్టారని అన్నారు. ఫార్ములా ఈ రేసుల వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగిందని లాయర్ స్పష్టం చేశారు.
ఇక ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని, రెండు నెలల కిందట ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ
విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని, ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందన్నారు. ప్రతి విషయం ఎఫ్ఎఆర్ లో ఉండదని, దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయని అన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు పంపారని, ప్రజాధనం విదేశీ కంపెనీకి పంపారని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేది పూర్తి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం లో మున్సిపల్ శాఖ కు ఆయన మంత్రిగా ఉన్నారు. పూర్తి బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు.
అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ మెన్షన్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. దీనిలో భాగంగా ముందుగా సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లగా, ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపారు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు.. సీజే కోర్టులో లంచ్ మోషన్ మెన్షన్ చేశారు. పిటిషన్ పై విచారణను హైకోర్టు స్వీకరించింది.