ముందుంది… పుష్పా..
సంధ్య థియేటర్ ఘటనలో ముందు చాలా ఉందన్న హైదరాబాద్ సీపీ
పబ్లిక్ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని బౌన్సర్లకు హెచ్చరిక
మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్కు ముందే తెలుసు
పోలీసులు అనుమతి ఇచ్చారన్నది పూర్తిగా అబద్దం
Sandhya Theater stampede: సంధ్య థియేటర్ ఘటనలో ఇంకా ఏం కాలేదని.. ఇక ముందు ఇంకా చాలా ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై పది నిమిషాల వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కేసు కోర్టులో ఉన్నందను ఇంతకు మించి వివరాలు వెల్లడించలేమన్నారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్ల వ్యవహరించే తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
చిక్కడపల్లి ఏసీపీ రమేష్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కు ముందు విషయాన్ని తెలిపామన్నారు. ఒక మహిళ చనిపోయాడు. పిల్లాడు తీవ్ర గాయాల పాలయ్యాడు.. పరిస్థితి అదుపులో లేదని చెప్పాం. మీకు ఇబ్బంది ఉంటుందని చెప్పామన్నారు. అసలు ముందు అల్లు అర్జున్ మేనేజర్ మమ్మల్ని కలవనివ్వలేదని, మేం అల్లు అర్జున్కు చెబుతామని అన్నారని చెప్పారు. కానీ వారు వెళ్లలేదు… మమ్మల్ని కూడా చెప్పనివ్వలేదన్నారు. అదే సమయంలో మా డీసీపీ వచ్చారని అన్నారు.
డీసీపీ గారి సూచనతో వాళ్లను నెట్టుకుంటూ నేను అల్లు అర్జున్ వద్దకు వెళ్లాను. అల్లుఅర్జున్ చెవిలో చెప్పాను. మహిళ చనిపోయిందని.. పిల్లాడు గాయపడ్డాడని చెప్పాను. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని.. పోలీసులు రూట్ క్లియర్ చేశామని ఆయనకు చెప్పాం. అయినా అల్లు అర్జున్ వినిపించుకోలేదు. సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానన్నారు. అదే విషయాన్ని డీసీపీగారి దృష్టికి తీసుకువచ్చాం.. అప్పుడు సార్, మేం మరోసారి లోపలికి వెళ్లాం. ఓ 10-15 నిమిషాలు టైం ఇచ్చాం. ఆ తర్వాత ఆయన్ను బయటకు తీసుకొచ్చాం. వాస్తవంగా జరిగింది ఇదేనని రమేష్ వెల్లడించారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన పర్మిషన్ లెటర్పై కూడా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. థియేటర్ యాజమాన్యానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. లెటర్ ఓ వైపు మాత్రమే వైరల్ చేస్తున్నారు. పర్మిషన్ లెటర్ వెనకాలే కుదరని రాసినట్లు స్టేషన్ ఎస్ఎచ్వో రాజు నాయక్ వెల్లడించారు. తాను ఓరల్గా కూడా వారికి పర్మిషన్ లేదని చెప్పినట్లు తెలిపారు.