ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం

Cold Wave: తుఫాను ప్ర‌భావంతో కొద్దిరోజులు చ‌లి తీవ్ర‌త త‌గ్గిన మ‌ళ్లీ పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఏజెన్సీలో అయితే చ‌లికి జ‌నం గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం చలిపులి పంజా విసిరింది. చ‌లికి తోడు ఎక్కువగా చలి గాలులు వీస్తున్నాయి. తీవ్ర చలికి తోడు గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. చలి నుంచి ఉప శమనం కోసం మంటలు వేసుకుంటున్నారు. పొగమంచుతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంత‌రాయం ఏర్ప‌డుతోంది.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లాలో చలి. తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నిన్న కొమురంభీం జిల్లా సిర్పూర్ యూ లో 7.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ దరిలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 10.5 డిగ్రీలు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి లో 12.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో మనుషులే కాకుండా పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తీవ్ర‌మైన చలిగాలుల‌తో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆరుబయటే ఎండలో పాఠాలు బోధిస్తున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు కశ్మీరును తలపిస్తున్నాయి. జనాలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు.

You might also like