రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలు అడిగారు
KTR for ACB investigation: “వాళ్లు కొత్తగా అడిగిందేమీ లేదు.. రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు. పైసలు ఇక్కడి నుంచి పంపించామని చెబుతున్నా.. అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళ. చెబుతున్నారు… ఇక్కడ అవినీతి ఎక్కడ ఉందని అడిగితే సమాధానం లేద”ని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారించింది. ఈ కేసులో ఏ1 గా ఉన్న కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట ఆయన తరఫు లాయర్ రామచంద్రరావు కూడా ఉన్నారు. అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది.
ఏసీబీ విచారణ ముగించుకుని బయటకు వచ్చిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తనకు తెలిసిన మేరకు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని చెప్పారు. మళ్లీ ఎప్పుడూ విచారణకు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పానని తెలిపారు. ఇదో చెత్త కేసు.. ఇందులో విషయమే లేదు.. ప్రభుత్వ ఒత్తిడితో అసలు ఏం చేస్తున్నారో మీకే తెలియడం లేదని ఏసీబీ అధికారులకు చెప్పానని అన్నారు. రాజకీయ ఒత్తిడితో కేసు పెట్టి.. దీని వల్ల ఏదో సాధిద్దామని అనుకుంటే అది ఆయన మూర్ఖత్వమే అవుతుందనే మాట కూడా చెప్పాను. విచారణకు ఎప్పుడూ, ఎన్నిసార్లు పిలిచిన వస్తానని పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పాను. ఎప్పుడూ పిలుస్తారో తెలియదని.. పిలిచినప్పుడు మాత్రం వస్తానని చెప్పానని కేటీఆర్ వెల్లడించారు.