ఆదివాసీలకు అండగా ఉంటాం
-వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం
-విద్యతోనే జీవితంలో ఏదైనా సాధ్యం
-మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
Manchryal Police: ఆదివాసీలకు తాము అండగా నిలబడతామని, వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల)లో పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన కుటుంబాలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు ప్రజల కోసమే ఉన్నారని అన్నారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించాలన్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ హాస్టళ్లలో అందులో చేర్పించి చదివించాలని కోరారు. గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందన్నారు. మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రలోభాలకు గురిచేసి చెడుమార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారని, వారి ప్రలోభాలకు లొంగవద్దని ఆయన గిరిజనులకు సూచించారు.
గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా, పోలీసులకు చెప్పాలని డీసీపీ కోరారు. ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్ వచ్చి తమ సమస్యలు వివరిస్తే వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డీసీపీ స్థాయి అధికారి రావడంతో ప్రజలు వారికి పెద్ద ఎత్తున సంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, తాండూర్ సీఐ కుమార్ స్వామి, మాదారం ఎస్ఐ సౌజన్య, తాండూర్ ఎస్ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.