నిప్పుల అక్ష‌రం అలిశెట్టి

Alishetty Prabhakar: అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన పదాలు.. రక్తం ఉడికించే మాటలతో మర ఫిరంగుల్లాంటి కవితలు రాశారు అలిశెట్టి ప్రభాకర్.

భారతదేశ విప్లవ చరిత్రకు మరిచిపోని అధ్యాయాన్ని ఇచ్చారు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో 1954 జనవరి 12 న చినరాజం, లక్ష్మీ దంపతులకు అలిశెట్టి ప్రభాకర్ జ‌న్మించారు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. ఇంట‌ర్ పూర్తి చేయాల‌నుకున్నా అప్పటికే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోశాడు. ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు ప్రభాకర్..పెన్సిల్ తో బొమ్మలు గీసే హాబీ, ప్రభాకర్ జీవితానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది.. కొంతమంది మిత్రుల సూచనలతో కవితలకు సరిపోయే బొమ్మలు గీసి ఇచ్చిన ప్రభాకర్.. వాటి స్ఫూర్తితో కవిత్వం రాశాడు.. అలా 18 ఏళ్ల వయసులోనే బూర్జువా దోపిడీదారులపై కలాన్ని ఎక్కుపెట్టాడు.1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.

ప్రభాకర్ గుండె లోతుల్లో అణిచివేయబడ్డ బడబాగ్ని 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. పెత్తందారి వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్ లోని అక్షర సూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ఎర్రపావురాలుగా ఎగరేశాడు. ఆనాటి నుంచి ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. అల్పాక్షరాలతోనే అనల్పార్థాన్ని ఇచ్చే నానీలనే మినీ కవిత్వంతో తెలుగు సాహితీలోకంలో అలజడి సృష్టించాడు. అక్షరాలతోనే సమర శంఖం పూరిస్తున్న ప్రభాకర్ పై ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు కక్షకట్టారు. ఫలితంగా నిర్బంధం నీడలా వెంటాడింది.. అందుకే జగిత్యాల నుంచి కరీంనగర్ కు షిఫ్ట్ అయ్యాడు. బతకడం కోసం శిల్పి స్టూడియో ప్రారంభించాడు.1979లో ‘‘మంటల జెండాలు’’ సంకలనాన్ని వెలువరించాడు.

ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. ఇంకోవైపు కవితలు రాశాడు. మరోవైపు బొమ్మలు కూడా గీశాడు. తనలోని భావాలకు చిత్రరూపమిచ్చి వాటితోనే చిత్రకవితలు రాశాడు. ఆ ప్రక్రియ అప్పట్లో పెద్ద సంచలనం. 1981లో ‘చురకలు’ కవితా సంకలనాలను పీడితుల పక్షాన సంధించాడు. వ్యంగ్యం, పదును, విమర్శ, సామాజిక స్పృహ లాంటివన్నీ ఒకేసారి చురకల్లో కనిపిస్తాయి. ప్రజల కోసం, వారి బతుకులు బాగు చేయడానికి వారి బాధలు ప్రపంచానికి తెలియచేయడానికే కవిత్వమని నమ్మిన ప్రభాకర్ అందుకోసం అహర్నిశలు శ్రమించాడు. 1982లో భార్య, ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఆయన రాసిన రక్తరేఖ, సంక్షోభ గీతాలు కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ప్రభాకర్ దృష్టిలో జీవితం, జీవించడం రెండూ వేర్వేరు. అలా సమాధిలా.. అంగుళం మేరకన్నా కదకుండా పడుకుంటే ఎలా? కొన్నాళ్లు పోతే.. నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు అంటూ జీవితానికి, జీవించడానికి తేడా చెప్పాడు.

ఇక ఆయ‌న క‌విత్వాలు అంటే సామ్యానుడు నిద్ర లేచేలా, నిరంకుశ ప్ర‌భుత్వాల‌కు అంకుశంలా ఉండేవి. అలిశెట్టి క‌విత్వం అంటేనే అద్భుతం.. ఆయ‌న ఓటు గూర్చి చెప్తూ…

“ఓటు నీ పచ్చి నెత్తురు మాంసం ముద్ద
చూస్తూ చూస్తూ వేయకు ఓ గద్దకి…” అంటూ నిర్మొహమాటంగా చెప్తాడు.

రాజకీయం గురించి మ‌రో క‌విత చెబుతూ..
“ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవరిని మోసగించనని
ఒక పులి పశ్చాతాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథలిని
గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి” అంటాడు.

పేదోడికి అంద‌ని వైద్యం గురించి..
“ప్రభుత్వాసుపత్రి పనికిరాదు ప్రైవేటు భరించరాదు
మరి రోగం కుదిరేదెట్లా’ అంటాడు.

ఆయ‌న సెక్స్ వ‌ర్క‌ర్ల గురించి క‌విత అయితే ఒక సంచ‌ల‌న‌మే..
‘‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై’’ అంటూ సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు ప్రభాకర్. నాలుగు వాక్యాల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్లకు కట్టినట్టు ఒక్క అలిశెట్టి తప్ప ఇంకెవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు.

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్.. కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. బతుకుని, చావుని సమానంగానే స్వీకరించాడు. ‘మరణం నా చివరి చరణం కాద’ని ధిక్కారం నిండిన గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించాడు. తెర వెనక లీలగా మృత్యువు కదలాడినట్టు తెరలు తెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని పర్సనల్ పోయెం అనే కవితలో రాసుకున్నాడు. పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్.. పైసల కోసం దారి తప్పలేదు. ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశమచ్చినా ఒప్పుకోలేదు.. సినిమాకవిగా మారి ఉంటే ఎంతో డబ్బు, పేరు సంపాదించేవాడు. కాని, సమాజం కోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్నాడు. ఫలితంగా అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక 1993 జనవరి 12న హైదరాబాద్ లో చనిపోయాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like