ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
సామాజిక సమరసతా వేదిక తెలంగాణ కో కన్వీనర్ అప్పాల ప్రసాద్

వరంగల్ – మహిళలు అందరూ ఝాన్సీలక్ష్మీబాయి వంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ కో కన్వీనర్ అప్పాల ప్రసాద్ కోరారు. ఆయన వరంగల్ పట్టణంలో నిర్వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి జయంత్యుత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరం నాటికి భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అత్యధిక జనాభా ఉన్న ఈ దేశంలో మహిళా శక్తి ఎక్కువగా ఉందన్నారు. ఈ శక్తి గనుక మంచి మార్గంలో నడిస్తే భారతదేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీని కోసం మన భారతీయ జీవన విధానానాకి పట్టుగొమ్మ అయిన కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయగల బాధ్యత, సామర్థ్యం మహిళల్లోనే ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ స్వర్ణలత, ఎల్బీ కళాశాల ఉమెన్ ఎన్పవర్మెంట్ ఇన్చార్జీ హరిణితో పాటు ప్రాంత సహ బౌద్దిక్ పొద్దుటూరి రూప, వరంగల్ జిల్లా కార్యవాహిణి దిడ్డిగ జ్యోతిర్మయి, వరంగల్ నగర శారీరక్ ప్రముఖ్ రమ, వరంగల్ నగర సహ బౌద్దిక్ ప్రముఖ్ వాణి, నగర సంపర్క ప్రముఖ్ సునీత, తరుణీ విభాగ్ ప్రముఖ్ శ్రీరాం, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ర్యాలీ..
రాష్ట్ర సేవికా సమితి తరుణీ విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. వరంగల్లోని రాణిరుద్రమ సర్కిల్ నుంచి ఎల్బీ కళాశాల వరకు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుర్రంపై ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారిణితో పాటు పెద్ద ఎత్తున మహిళలు, స్వయం సేవికలు పాల్గొన్నారు. మార్గమధ్యలో సేవికలు ప్రదర్శించిన దండ, నియుద్ధ విన్యాసాలు, ఝాన్సీ లక్ష్మీబాయిపై చేసిన నృత్య ప్రదర్శన అందరి హృదయాలను ఆకట్టుకుంది.