జోరుగా సాగుతున్న కోడిపందాలు..

Rooster racing: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గతంతో పోల్చితే పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేలల్లో బెట్టింగ్లు నిర్వహిస్తూ పందెం రాయుళ్లు బరిలోకి దిగుతున్నారు. అదే సమయంలో సామాన్యులు వీటిల్లో డబ్బులు పెట్టి నిండా మునుగుతున్నారు. మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టి కోడి పందాల స్థావరాలపై దాడులు చేసి పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు.
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాతో పాటు, మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీర ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి, జైపూర్, భీమారంతో పాటు దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో చోట ఆటను మార్చుతున్నారు. సంక్రాంతి పండగ కావడంతో చాలా మంది గ్రామాలకు చేరుకున్నారు. అదే అదనుగా ఈ కోడి పందేలు నిర్వహిస్తూ వేలల్లో బెట్టింగ్లు సాగిస్తున్నారు.
పోలీసులు కూడా నిఘా విస్తతృం చేసి పందాలు ఆడేవారిని పట్టుకుంటున్నారు. మంగళవారం 12 మందిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడి పందాల స్థావరం పై కౌటాల పోలీసుల దాడి చేసి తొమ్మది మంది నిందితులను పట్టుకున్నారు. కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడి పందాలు నిర్వహియిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడ స్థావరంపై దాడి చేసినట్లు SI ఎన్. మధుకర్ తెలిపారు. సిర్పూర్కు చెందిన కారే మహేష్, గుడ్లబోరికి చెందిన బీవంకర్ చందు, ఉర్కుడే సంతోష్, వేములవాడ సాతన్న, దండేర పాండురంగ్, నాగేపల్లికి చెందిన వడై రవీందర్, సోన్లే భీమారావు, తుమ్మిడిహెట్టికి చెందిన కోవా పుల్లికరావు, వీర్దండికి చెందిన జాడే తిరుపతిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు పందెం పుంజులు, రూ. 3,900, మూడు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఇదే జిల్లాలో చింతలమానపల్లి మండల పరిధిలోని రణవెళ్లి గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఆ స్థావరంపై సైతం దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు కోడిపుంజులు ,1550 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చింతలమానపల్లి ఎస్సై నరేష్ వెల్లడించారు.