అవినీతి, అలసత్వంపై కలెక్టర్ కొరఢా

అవినీతి, అలసత్వంపై కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కొరఢా ఝళిపించారు. ఆయన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అవినీతికి పాల్పడినందుకు డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేయగా, విధుల్లో అలసత్వం వహించిన జిల్లా పౌరసరఫరాల అధికారికి నోటీసులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి ఏకంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాబా వినోద్ కుమార్ మంగళవారం, బుధవారం గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ వెంకటేష్ దోత్రే బాబా వినోద్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రతి శుక్రవారం విధులకు గైర్హాజరు కావడమే కాకుండా, సోమవారాల్లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్ కూడా హాజరు కావడం లేదని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీకి గైర్హాజరు కావడమే కాకుండా, ఉన్నతాధికారులు ఫోన్లు చేసినా స్పందించడం లేదని వీటన్నింటి పైనా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
కౌటాల డిప్యూటీ తహసీల్దారు సస్పెన్షన్..
భూముల రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు పాల్పడినట్లు తేలడంతో కౌటాల డిప్యూటీ తహసీల్దారు ఎండీ. మస్కూర్ అలీపై కలెక్టర్ దోత్రె సస్పెన్షన్ వేటు వేశారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సర్వే నెం. 65/193/3 బాలాజీ అంకోడ గ్రామంలో ఉన్న ఎకరం భూమి విషయంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం) చట్టం, 1977, తెలంగాణ భూమిపై హక్కులు, పట్టేదార్ పాస్ బుక్స్ చట్టం, 2020 ప్రకారం భూమి వారసత్వ నియమాలను కూడా ఉల్లంఘించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మస్కూర్ అలీని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.