మెహుల్‌ చోక్సీ అరెస్ట్‌

Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)తో సహా భారతీయ సంస్థల అభ్యర్థన మేరకు ఈ అరెస్టు జరిగింది. ముంబై కోర్టులు అతనిపై బెయిల్ రహిత వారెంట్లు జారీ చేశాయి. 2018 మే 23న తొలిసారి 2021 జూన్‌ 15న రెండోసారి వారెంట్లు జారీ అయ్యాయి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్‌ చోక్సీ సైతం నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం సైతం ఉంది. వైద్య చికిత్సల కోసం ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ సైతం ఈ కేసులో నిందితుడు. ఆయన లండన్‌లో ఉండగా.. భారత్‌కు రప్పించే ప్రక్రియ కొనసాగుతున్నది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడానికి కొన్ని వారాల ముందు జనవరి 2018లో భారత్‌ నుంచి పారిపోయారు. అయితే, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like