సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైని బ్లాక్ తొలిమెట్టు
ప్రజా పాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ
ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు యావత్తు తెలంగాణకే గర్వకారణం
13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం
ఒడిశా నైనీ గని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Singareni: సింగరేణి సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. బుధవారం ప్రజా భవన్ నుంచి ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశాలో గని ప్రారంభించడం సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భం అన్నారు. ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణి కి కేటాయించి తొమ్మిది ఏళ్ళు అయినా వివిధ రకాల అనుమతులు అందడంలో జాప్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఏడాది కిందట కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలు మార్లు కలిసి పూర్తి అనుమతులు సాధించామన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు.
నేడు ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకు సింగరేణి విస్తరణలో తొలి అడుగుగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సింగరేణి విస్తరిస్తుందన్నారు. త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, ఒడిశా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి, స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరా, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
గత ఏడాది జులైలో తన ఒడిశా పర్యటన సందర్భంగా అంగూల్ ప్రాంత అభివృద్ధికి తాను ఇచ్చిన ప్రతీ హామీని త్వరలోనే సింగరేణి సంస్థ అమలు చేస్తుందన్నారు. ఆ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో ఇక్కడ కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడం కోసం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీ కి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన స్థల సేకరణకు ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకం ప్రారంభించిన సింగరేణి, ఈ గనిని ఆదర్శప్రాయంగా నిర్వహించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా ఒడిశాలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఒక చరిత్రాత్మక సందర్భమన్నారు. నైనీ బొగ్గు గని వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరా ప్రసంగిస్తూ తమ ప్రాంతంలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గనికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అంగూల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చూపిన ప్రత్యేక చొరవ, సహకారం వలన నైనీ బొగ్గు బ్లాక్ ఈ రోజు ప్రారంభించుకో గలిగామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలను విజయవంతంగా చేపడతామన్నారు. కార్యక్రమంలో ప్రజా భవన్ నుంచి ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఓఎస్డీ సురేందర్ రెడ్డి, సింగరేణి ఈడీ (కోల్ మూమెంట్) ఎస్డి.ఎం.సుభానీ పాల్గొనగా.. నైనీ నుంచిసంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, నైనీ జీఎం టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.