కోర్టు ఆదేశాలు బేఖాతర్.. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ

ACB: ఆ ఎస్ఐ ఏకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. కోర్టు చెప్పినా డబ్బులు ఇవ్వకుండా బాధితున్ని పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పించుకుని నానా ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఆ ఎస్ఐపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
మంచిర్యాల జిల్లా CCC పోలీసు స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్ఐ నెల్కి సుగుణాకర్పై కేసు నమోదు చేశారు. ఏకంగా కోర్టు ఆదేశాలు ధిక్కరించడమే కాకుండా, బాధితున్ని ఇబ్బందులకు గురి చేశాడనే ఆరోపణలపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో గుప్త నిధులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. జనవరి 25న ఈ కేసు నమోదు కాగా, దానికి సంబంధించి కోర్టు సీజ్ చేసిన రూ. 2 లక్షలు తనకు ఇవ్వాలని బాధితుడు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అతని డబ్బులు అతనికి ఇవ్వాలంటూ కోర్టు ఈ నెల 4న ఆదేశాలు జారీ చేసింది.
దీంతో బాధితుడు సీసీసీ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ను కలిసి తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. అయితే, ఎస్ఐ అతన్ని ప్రతి రోజుల పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎస్ఐ తనకు రూ. 1.50 లక్షలు ఖర్చయ్యాయని తన వద్ద రూ.50,000 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. బాధితుడికి రూ. 2,00,000 ఇస్తున్నట్లుగా ఒక ఫోటో తీసి, కొంత సమయం తర్వాత తనను కలవమని ఫిర్యాదుదారునికి చెప్పి, రూ. 50,000 కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇలా బాధితున్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఐ సుగుణాకర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.