పని లేదంటూ ఉపాధి కూలీలను పంపించేశారు…

NREGA: ఉపాధి హామీ పనులకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంలో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు కావాలనే కూలీలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పని స్థలానికి వెళ్లిన కూలీలకు పని లేదంటూ తిప్పి పంపడంతో వారంతా ఉసూరుమంటూ వెనక్కి తిరిగారు…
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్కు చెందిన 40 మంది కూలీలకు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. అయితే, కొత్త పనుల కోసం అధికారులు మాదారం టౌన్షిప్లో కాకుండా, పోచంపల్లి ప్రాంతంలో పనులు పెడతామని చెప్పారు. తమకు మాదారంలో కావాలని అధికారులకు స్థలాన్ని సైతం చూపించారు. అక్కడ పనులు ఇప్పుడు పెట్టమని తాము చెప్పిన చోటే చేయాలని చెప్పడంతో కూలీలు సైతం సరే అని అంగీకరించారు.
అయితే, సోమవారం, మంగళవారం రెండు రోజులు అధికారులు కూలీలకు పనుల విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అధికారులకు ఫోన్లు చేసినా కనీసం పట్టించుకోలేదు. చివరకు మంగళవారం ఉదయం మీకు పని ఉంది రమ్మంటూ 40 మంది కూలీలు పని ప్రదేశానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పని లేదంటూ తిప్పి పంపించారు. అధికారుల వైఖరిపై కూలీలు మండిపడుతున్నారు. కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూలీలు మండిపడుతున్నారు. గ్రామంలో ఒక వర్గానికి అనుకూలంగా ఉంటూ తమకు పనులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.