దేశ సేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి

Singareni: సింగరేణి సంస్థ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడం పట్ల సీఎండీ ఎన్ బాలరామ్ హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలనే ఉద్దేశంతో సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఏడుగురు అభ్యర్థులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం మన సింగరేణి కి రాష్ట్రానికి గర్వకారణమని సీఎండీ ఎన్ బాలరామ్ అన్నారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహాయం పొంది, ఈ ఏడాది UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఏడుగురు అభ్యర్థులు ఇట్టబోయిన సాయి శివాని, పోతరాజు హరి ప్రసాద్, రాపర్తి ప్రీతి, బానోత్ నాగరాజ నాయక్, తొగరు సూర్యతేజ, గోకమల్ల ఆంజనేయులు, రామటెంకి సుధాకర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులు అందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు. వారంతా దేశసేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువత తమ కలలు, ఆశయాలను నిజం చేసుకునే విధంగా వారికి మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు