జ‌మ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి

Terrorist : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు(Terrorist) చొరబాటుకు యత్నించారు. దీంతో భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారా..? అన్న అనుమానంతో ఉగ్ర వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్టు అనుమనిస్తున్నారు.

బుధవారం ఉదయం బారాముల్లా (Baramulla)లోని ఉరి వద్ద ఉన్న సర్జీవన్‌ ప్రాంతం గుండా సుమారు ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నియంత్రణరేఖ వద్ద అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నారు. చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం విజయవంతంగా భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.

కాగా, కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతనాగ్‌ జిల్లా పెహల్గామ్‌ పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి మనీశ్‌ రంజన్‌, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like