ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు

(Pahalgam terror attack: ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం’ అని షా తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పిస్తున్న ఫొటోలను ఎక్స్లో పోస్టు చేశారు.
ఇవాళ ఉదయం శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) మృతులకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా తమ ఆప్తులను కోల్పోయిన వారు కేంద్ర మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్ర కోసం వస్తే మావాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ రోదించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హేయమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు.