ఆయువు ప‌ట్టుపై అస‌లైన దెబ్బ‌

సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేసిన భార‌త్‌
ఇప్ప‌టికే ఆ న‌దీ జ‌లాల‌పై విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు
వాటిపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న పాకిస్తాన్
ఒప్పందం ర‌ద్దైతే ఏడారిలా మార‌నున్న దాయాది

Indus Waters Treaty: శ‌త్రువు ఎదిరించాలంటే ప్ర‌తిసారీ యుద్ధాలే చేయ‌క్క‌ర్లేదు.. వారి బ‌ల‌హీన‌ల‌త‌పై దెబ్బ కొడితే స‌రిపోతుంది… ఇదీ చాణ‌క్య నీతి.. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌భుత్వం అదే చేస్తోంది.

పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మార‌డం ఖాయ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు నీటిని వినియోగించుకునేందుకు పాక్ ఈ సింధూ నదిపైనే ఆధారప‌డుతుంది. తాజాగా పాక్‌కు నీళ్లు ఇవ్వడం ఆపేస్తే ఆ దేశం ఎడారిలా మారనుంది. 1947లో దేశం రెండుగా విడిపోయిన‌ప్పుడు, భార‌త‌దేశంలో అత్యంత కీల‌క‌మైన న‌దీ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టైన సింధు న‌ది, దాని ఉప‌న‌దులు భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య‌ ఉండిపోయాయి. పంజాబ్, సింధ్ ప్రాంతాల‌కు ఈ న‌దులే జీవ‌నాధారం. అయితే, రెండింటి మ‌ధ్య న‌దీ జ‌లాలు ఎలా పంచుకోవాల‌నే విష‌యంలో సందిగ్ధ‌త త‌లెత్తింది. ఈ సంక్షోభాన్ని గుర్తించిన ప్ర‌పంచ బ్యాంకు (World Bank) ఇరు దేశాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించింది. తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చలు జ‌రిపి చివ‌ర‌కు ఒక అంగీకారానికి వ‌చ్చేలా చేసింది. ఆ ఫ‌లిత‌మే 1960 సెప్టెంబ‌ర్ 19న క‌రాచీలో కుదిరిన సింధు న‌దీ జ‌లాల ఒప్పందం.

ఒప్పందం ఏం చెబుతోంది..? ఎవ‌రికి ఏ న‌ది..?
ఈ ఒప్పందం సింధు న‌దీ వ్య‌వ‌స్థ‌లోని ఆరు కీల‌క ఉప‌న‌దుల‌ను ఇరు దేశాల మ‌ధ్య పంచుకోవ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయ్యాయి. భార‌త్‌కు తూర్పు న‌దులైన‌ రావి (Ravi), బియాస్ (Beas), స‌ట్లెజ్ (Sutlej) న‌దులు ద‌క్కాయి. ఈ మూడు న‌దుల జ‌లాల‌ను భార‌త‌దేశం పూర్తి స్వేచ్ఛ‌తో, ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవ‌చ్చు. వ్య‌వ‌సాయం, విద్యుత్, తాగునీరు… ఇలా దేనికైనా మ‌నం వాడుకోవ‌డానికి ఈ ఒప్పందం పూర్తి హ‌క్కు ఇచ్చింది. పాకిస్థాన్‌కు ప‌శ్చిమ న‌దులైన సింధు (Indus), జీలం (Jhelum), చీనాబ్ (Chenab). ఈ న‌దుల‌పై పూర్తి అధికారం పాకిస్థాన్‌కు ఇచ్చారు. అవి భార‌త్ గుండా ప్ర‌వ‌హించినా, వాటి జ‌లాల‌ను వాడుకునే హ‌క్కు పాకిస్థాన్‌కే ఎక్కువ‌. అయితే, సింధు, జీలం, చీనాబ్ భార‌త్ భూభాగం గుండా కూడా వెళ్తాయి కాబ‌ట్టి, వాటిపై భారత్‌కు కొన్ని ప‌రిమిత హ‌క్కులున్నాయి. నీటి ప్ర‌వాహాన్ని ఆపకుండా చిన్న‌పాటి హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌చ్చు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల‌లో ప‌రిమిత స్థాయిలో సాగునీటిని, చిన్న‌పాటి నిల్వ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అయితే, ఈ వాడుక పాకిస్థాన్ కు ద‌క్కాల్సిన నీటి ప్ర‌వాహానికి ఎక్క‌డా అడ్డు రాకూడ‌దు.

గొడ‌వ వ‌స్తే ఎలా ప‌రిష్క‌రించుకోవాలి.. ?
ఇందులో వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి వ్య‌వ‌స్థ రూపొందించారు. ఇరు దేశాల‌కు చెందిన జ‌ల క‌మిష‌న‌ర్లు ఉండే ‘శాశ్వత సింధు కమిషన్’ (Permanent Indus Commission-PIC) ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుస్తూ, ఒప్పందం అమ‌లు ప‌ర్య‌వేక్షిస్తూ ఉంటుంది. ఏవైనా చిన్న‌పాటి సందేహాలు, స‌మ‌స్య‌లు ఉంటే క‌మిష‌న్ స్థాయిలో మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటారు. క‌మిష‌న్ స్థాయిలో ప‌రిష్కారం కాని చిన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నియ‌మించే ఒక స్వతంత్ర నిపుణుడు ప‌రిశీలించి తుది నిర్ణ‌యం తీసుకుంటారు. అక్క‌డ ప‌రిష్కారం కాక‌పోతే ఒక తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేస్తారు. ఇరు దేశాల మ‌ధ్య 1965, 1971 యుద్ధాలు జ‌రిగినా, కార్గిల్ ఘ‌ర్ష‌ణ వ‌చ్చినా, అనేక సార్లు స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా ఈ ఒప్పందం మాత్రం ర‌ద్ద‌వ్వ‌లేదు. జ‌లాల పంపిణీ ఆగ‌లేదు. అందుకే దీన్ని ప్ర‌పంచంలోనే అత్యంత నిల‌క‌డైన‌, విజ‌య‌వంత‌మైన జ‌ల ఒప్పందాల్లో ఒకటిగా ప‌రిగ‌ణిస్తారు.

మోదీ వ‌చ్చాక మారిన ప‌రిస్థితి..
అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఈ ఒప్పందంపై మ‌ళ్లీ చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మోదీ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ప‌శ్చిమ న‌దుల‌పై భార‌త్ నిర్మిస్తున్న కొన్ని విద్యుత్ ప్రాజెక్టుల డిజైన్‌ల‌పై పాకిస్థాన్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. అవి ఒప్పంద నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌ని వాదిస్తోంది. మ‌న దేశం మాత్రం, త‌న‌కు ఒప్పందం ఇచ్చిన హ‌క్కుల మేర‌కే ప‌నులు చేస్తున్నాని బ‌లంగా చెబుతోంది. భారత్‌ కూడా తూర్పు న‌దుల (రావి, బియాస్, స‌ట్లెజ్) జ‌లాల‌ను పూర్తిగా వినియోగించుకోవ‌డంపై ఇటీవ‌ల దృష్టి పెట్టింది. పాకిస్థాన్‌కు వృథాగా వెళ్తున్న మ‌న నీటిని ఆపి, మ‌న దేశంలోని పంజాబ్, హ‌ర్యానా, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల‌కు సాగునీటి అవ‌స‌రాల కోసం మ‌ళ్లించ‌డానికి కొన్ని ప్రాజెక్టుల‌ను వేగ‌వంతం చేసింది. ఇది కూడా ఒప్పందం ప్రకారం భారత్‌కు ఉన్న హ‌క్కే. స‌మ‌స్య‌లు, స‌వాళ్లు వ‌స్తున్నా, వాటిని ఒప్పందంలో పేర్కొన్న మార్గాల ద్వారా ప‌రిష్క‌రించుకుంటూ ఈ బంధం ఇలాగే ఇంతకాలం కొన‌సాగించారు. ఇక పహల్గాం ఉగ్రదాడితో ఈ ఒప్పందానికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like