కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది

-మహిళలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామ‌న్నారు.. ఇవ్వ‌లేదు
-కాంగ్రెస్ చేతిలో మోస‌పోయిన ప్ర‌తి ఒక్క‌రూ స‌భ‌కు రావాలి
-16 నెల‌ల్లో 16 ప‌నులు కూడా కాలేదు
-కాంగ్రెస్ నాయ‌కులు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాలి
-అధికార పార్టీపై ధ్వ‌జ‌మెత్తిన ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది, మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానించారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు.

అన్ని వర్గాలు అండ‌గా క‌లిసి రండి..
మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని.. మున్సిపాలిటీల్లో, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ప్రతి జిల్లాలో హాస్టల్‌తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. మహిళలు భారీ ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టిస్తే.. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి లక్షలాది ఎకరాలు ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. రైతులంతా గులాబీ దండులా సభకు కదలిరావాలని కోరారు. తెలంగాణలోని ప్రజాస్వామ్య‌వాదులు, సోషల్ మీడియా సైనికులు కూడా హాజరుకావాలని పిలుపునిచ్చారు.

16 నెల‌ల్లో 16 ప‌నులు కూడా కాలేదు…
తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటారని.. కానీ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాత్రం తమకు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలక తీసుకొచ్చి ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ది చేతగాని ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందన్నారు క‌విత‌… 16 నెలల కాంగ్రెస్ పాలనలో 16 పనులు కూడా కాలేదని విమర్శించారు. దేశానికే సేవలు అందించడానికి టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామని వివరించారు. పరిణితి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూషన్ అని చెప్పారు. రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు అవాకులు, చెవాకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like