కాంగ్రెస్ రైతులను దోచుకుంటోంది..
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Former MLA Nadipelli Diwakar Rao: కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు పేరుతో రైతుల వద్ద దోచుకుంటోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లక్షెట్టిపేట మండలం గుల్లకోట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి కట్టింగ్ లేకుండా వరి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదన్నారు. కొనుగోలు కేంద్రంలో ప్రతి 40 కేజీల బస్తాకు రెండు కేజీలు అదనంగా కాంటా వేసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి కటింగు లేకుండా, షరతులు లేకుండా రైతులు దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండాలని దివాకర్ రావు కోరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరుగు పేరిట మంచిర్యాల నియోజకవర్గంలో అక్రమాలు చేస్తున్నారని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తామని చెప్పి ఇప్పటికే చాలా నెలలు అవుతోందన్నారు. వెంటనే 10 సంవత్సరాలలో జరిగిన వరిధాన్యం కొనుగోలుపై, ఇప్పుడు జరుగుతున్న వరి కొనుగోళ్లపై వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో DCMS మాజీ చైర్మన్ తిప్పని లింగయ్య, గుల్లకోట మాజీ సర్పంచ్ గొల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.