న‌న్ను కోసినా పైస‌ల్లేవ్‌..

CM Revanth Reddy: “నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం చెప్పండి…” అంటూ సీఎం ఆవేశంగా స్పందించారు. “ఈ స్థితిలో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆర్థికంగా దివాలా రాష్ట్రంగా మారిపోతాం. అప్పు కూడా పుట్టట్లేదు. దిల్లీలో అపాయింట్‌మెంట్ కోరితే కూడా ఇవ్వట్లేదు. చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అనిపిస్తోంది. దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి జీ తెలుగు మీడియా సంస్థ నిర్వహించిన తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రొగ్రామ్ కమాండ్ కంట్రోల్ వేదికగా జరిగింది. దీనిలో తెలంగాణ వ్యాప్తంగా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజల్ని కాపాడిన పలువురు పోలీసులను సన్మానించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటుందని సీఎం రేవంత్ అన్నారు. పూర్తిగా దివాళ స్థితిలో ఉందన్నారు. తమకు కావాల్సిన ఆదాయం 22 వేల కోట్లు అయితే.. రాబడి మాత్రం 18.500 కోట్లని చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలు నాయకులు, ప్రభుత్వం కలసి ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. తనను కోసిన కూడా తెలంగాణలో ఎక్కువ ఆదాయం రాదని అన్నారు. మనందరం కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దామన్నారు.

ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులను సూటిగా ప్రశ్నించారు. ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అవన్నీ గత ప్రభుత్వంలోని వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయి లేనన్నారు.

కేవలం పదహారు నెలల్లో తమ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసిందన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు, బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి, ప్రాజెక్టులు నిర్మించామని చెప్పి కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు పెట్టారని సీఎం గుర్తు చేశారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదని.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వమన్నారు. మనం పాలకులం కాదని… సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

ప్రజలపై యుద్ధం చేసి.. బాగుపడినవారు ఎవరూ లేరని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దంటూ కార్మికల నేతలకు ఆయన హితవు పలికారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు.. బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదన్నారు. స్వీయ నియంత్రణనే దీనికున్న ఏకైక పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దంటూ కార్మిక సంఘాల నేతలకు ఆయన హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేనని స్పష్టం చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్‌లో హాయిగా పాడుకున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనమని పేర్కొన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దని సూచించారు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదామని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like