అర్థ‌రాత్రి మెరుపుదాడి..

Operation Sindoor : అంద‌రూ ఊహించినట్టుగానే భార‌త్ పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 పాక్‌ ఉగ్రస్థావరాలను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేసిన‌ట్లు సైన్యం వెల్ల‌డించింది. భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేస్తూ అమలు చేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతమైనవనీ, కచ్చితత్వంతో తీవ్రతరం కాని విధంగా దాడులు చేసినట్లు భారత సైన్యం వెల్లడించింది. లక్ష్యాల ఎంపిక, దాడుల అమలులో పూర్తి సంయమనం పాటించామని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని సైన్యం స్పష్టం చేసింది.

పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్‌డ్‌ జస్టిస్‌ అని పోస్టు చేసింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామనీ, విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్‌ సన్నిహితా, జయాయ్‌ ప్రశిక్షితా అంటూ సంస్కృత వ్యాఖ్యాన్ని జోడించింది. పాకిస్థాన్‌పై భారత్‌ మెరుపుదాడులు చేయడంతో ఆ దేశం రగిలిపోతోంది. జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ రాజౌరీ ప్రాంతంలోని బింబర్‌ గాలీ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. పాకిస్థాన్‌ కవ్వింపులను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్‌ మెరుపు దాడుల వేళ.. పాకిస్థాన్‌ ప్రతీకార చర్యలకు తెగబడే అవకాశం ఉండటంతో సైన్యం అప్రమత్తమైంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like