కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. 22 మంది మావోయిస్టుల మృతి

Massive Encounter at Karre Gutta: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కర్రెగుట్టలో కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏరియల్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు బలగాలకు సమాచారం అందుతోంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా, దేవ లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతోంది. వేల మంది బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. మావోయిస్టులను రౌండప్ చేశాయని ప్రచారం జరిగింది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. అందులో భాగంగానే బలగాలు వీలు చిక్కినప్పుడల్లా కూంబింగ్ చేపట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
దాదాపు మూడు, నాలుగు రాష్ట్రాల నుంచి బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొనడం, ఊహించని రీతిలో కూంబింగ్ చేపట్టడంతో మావోయిస్టులకు మరోదారి లేకుండా పోయింది. ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇదివరకే వందల మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అడవులను వదిలి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు సూచిస్తున్నారు. కొందరు మావోయిస్టులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయి వారి మీద ఉన్న రివార్డు అవార్డును సొంతం చేసుకుంటున్నారు.