పాకిస్థాన్ వైమానిక స్థావరాలు తుక్కు.. తుక్కు..

India Pakistan War : భారత్ చేతిలో చావు దెబ్బ తింటున్నా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. తొలిరోజు భారత్ పై దాడి చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమైనా.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ మొదలు రాజస్థాన్ దాకా 26 కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసింది. శ్రీనగర్ లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. శ్రీనగర్ ఎయిర్ బెస్ దగ్గర పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ -16 పైటర్ జెట్ లను కూల్చివేసింది. మరోవైపు భారత్ బలగాలు ఐదు పాకిస్థాన్ మిసైళ్లను పేల్చివేశాయి. యుద్ధ విమానాలు కూల్చే సమయంలో పైలెట్ దూకేసినట్లు, పైలెట్ కోసం భారత ఆర్మీ గాలిస్తున్నట్లు సమాచారం.
భారత్ పాకిస్తాన్లోని మూడు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. డ్రోన్లు, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా వాటిని ధ్వంసం చేసింది. దాంతో పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఎయిర్బేస్ను మూసుకుంది. జమ్ము సమీపంలోని పాకిస్తాన్కు చెందిన డ్రోన్ల లాంచ్ పాడ్స్ను భారత సైన్యం ధ్వంసం చేసింది. భూ తలం నుంచి గగన తలానికి ప్రయోగించే మిసైల్స్ వ్యవస్థను ఇండియా యాక్టివేట్ చేసింది.
భారత్ ధ్వంసం చేసిన వైమానిక స్థావరాలు ఇవే..
రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్బేస్.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్కు చెందిన 5-6 స్క్వాడ్రన్స్ ఉంటాయి. చక్వాల్ లోని మురీద్ ఎయిర్బేస్.. పాకిస్తాన్ డ్రోన్ ఆపరేషన్లకు కేంద్ర బిందువు. ఇండియాపై తాజాగా జరిపిన యూఏవీ దాడులు కూడా ఇక్కడి నుంచే జరిగాయి. అడ్వాన్స్డ్ డ్రోన్లుగా భావించే షాహ్పార్ 1, బేరక్తార్ టీబీ2 వంటి వాటిని ఆపరేట్ చేసే స్క్వాడ్రన్స్ ఇక్కడే ఉంటాయి. షార్కోట్లోని రఫీక్ ఎయిర్బేస్.. అత్యంత కీలకమైంది. జేఎఫ్ 17, మిరేజ్ యుద్ధ విమానాలు ఇక్కడే ఉంటాయి. పంజాబ్ ప్రోవిన్స్లో ఉండే ఈ ఎయిర్బేస్ సరిహద్దుల్లో జరిగే పరిణామాల్ని పర్యవేక్షిస్తుంటుంది. పాకిస్తాన్ వైమానిక వ్యవస్థలో ఇది చాలా కీలకమైంది.
మిసైళ్ల ప్రయోగం.. నేలకూల్చిన ఆర్మీ..
మరోవైపు.. పాకిస్థాన్ సైన్యం ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దాడులకు ప్లాన్ చేసింది. ఫతాహ్ -2 మిస్సైల్ ను ప్రయోగించగా.. ఆ మిసైళ్లను భారత్ ఆర్మీ నేలకూల్చేసింది. భారత్ సైన్యం ప్రతీకార చర్యలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్.. ఆ దేశంలో అన్ని పట్టణాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ఎయిర్ స్పేస్ లను మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేసింది.