పులిని చూసి నక్క వాత పెట్టుకుంది…

Pakistan PM Shabaz Sharif:భారత్ ఏ పని చేస్తే తాము కూడా అదే చేస్తున్నామని చెబుతుంది పాకిస్తాన్… చెప్పడమే కాదు… సరిగ్గా దాన్నే అనుకరిస్తుంది.. అనురిస్తుంది కూడా.. మన పనులను ఆ దేశం అచ్చుగుద్దినట్లు కాపీ కొడుతుంది.. అభాసుపాలవుతుంది…
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. మొదటి నుంచి భారత ప్రధాని మోదీ (PM Modi) ఏం చేస్తే అదే తానూ చేస్తున్నాడు. పహల్గాందాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ ఐదు నిర్ణయాలు ప్రకటిస్తే పాక్ ప్రధాని కూడా అదే చేశారు. యుద్ధంలో భారత్ ఎలాంటి అడుగులు వేస్తే వాళ్ళు కూడా అవే నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజుల కిందట మన ప్రధాని మోదీ ఎయిర్ఫోర్స్ సిబ్బందిని కలిసి వారి సేవలను కొనియాడారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఆయన బాటలోనే ఆర్మీని కలిశారు. అక్కడ యుద్ధట్యాంకు ఎక్కి తమ సైనికులకు సాహసం గురించి ఉపన్యాసాలు దంచారు. అంతేకాదు ఆర్మీఛీఫ్ ఆసిమ్ మునీర్ (Pak Army Chief Asim Munir), ఎయిర్ మార్షల్ బాబర్ వీపు తడుతూ డ్రామాలు చేశారు. తన ప్రధాని పదవి ముగిశాక పుస్తకం రాస్తానని అందులో పాక్ సైనికుల ధైర్యం గురించి ప్రస్తావిస్తానంటూ బీరాలు పలికారు షెహబాజ్.
ఇక్కడ ఇలా… అక్కడ అలా..
రెండు రోజుల కిందట మోదీ అదంపూర్ ఇండియన్ ఎయిర్ బేస్(Adampur Indian Air Base) సందర్శించి వాయుసేనను ఉద్దేశించి ప్రసంగించారు. వాస్తవానికి యుద్ధంలో తాము ఆ ఎయిర్బేస్ ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో అదంతా తప్పుడు ప్రచారమని మోదీ అక్కడకు వెళ్లి మరీ నిరూపించారు. అదే సమయంలో ప్రపంచానికి, పాకిస్తాన్ ఏం చెప్పాలో చెప్పి మరీ వచ్చారు. కానీ పాక్ షెహబాజ్ పర్యటించిన సియాల్కోట్లోని పస్రూర్ ఆర్మీ క్యాంప్ పై భారత ఆర్మీ అటాక్ చేసి అక్కడి రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. మోదీలాగే తాను చేయాలనుకున్న షెహబాజ్ అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల కనిపించకుండా కవర్ చేశారు. వాస్తవానికి ఆయన ప్రయాణించిన విమానం అక్కడి వరకు చేరుకోనేలేదు. దీంతో ఒక జీప్లో ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. పస్రూర్ ఆర్మీ కంటోన్మెంట్ చేరుకున్న షాబాజ్ షరీఫ్.. అక్కడ ఉన్న ఓ యుద్దట్యాంక్ పై నుంచి మాట్లాడారు. భారత్ దాడుల వలన జరిగిన నష్టాన్ని మాట్లాడకుండా..శత్రువులు పెద్దవాళ్లు అయినా మీరు ఎదుర్కొన్నారంటూ చెప్పుకొచ్చారు.
అయితే, అంతర్జాతీయ మీడియా ఊరుకుంటుందా..? ఆయన పర్యటనను ఉతికి ఆరేసింది. లేని గొప్పలు చెప్పుకున్నారంటూ, ధ్వంసమైన ఆర్మీ బేస్లో ప్రధానమంత్రి ప్రసంగం అంటూ.. ఓడిపోయినా గెలిచినట్లు డబ్బాలు కొట్టుకున్నారంటూ ఇలా రకరకాలుగా కథనాలు రాసేశారు.. కొసమెరుపు ఏంటంటే.. ఆయన నిలబడి మాట్లాడిన యుద్ధట్యాంక్ వెనకాలే భారత్ దాడిలో మరణించిన పాకిస్తాన్ సైనికుల ఫొటోలు అతికించారు. అవి కనపడకుండా ట్యాంక్కు గడ్డి కప్పారు. ఎంతైనా సింహం సింహమే.. నక్క నక్కేనంటూ భారత్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ పర్యటన గురించి చెబుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని ఈ ఘటన గురించి పలువురు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.