సింగరేణి మెగా జాబ్మేళా

Singareni: సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం-1 ఏరియా గోదావరిఖనిలో వచ్చే ఆదివారం (మే 18) న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ వెల్లడించారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థలలో వివిధ విభాగాల్లో 3వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి జాబ్ మేళాలు ఇకపై ఇతర ఏరియాలలో కూడా నిర్వహిస్తామన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలతో పాటు, నిరుద్యోగ యువతకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి చేపడుతోందన్నారు. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇప్పటికే మందమర్రి, రామగుండం-1, భూపాలపల్లి ఏరియాలలో ప్రారంభించామన్నారు. ఇతర ఏరియాలలో కూడా ప్రారంభిస్తామన్నారు.