ప్రణాళికబద్ధంగా మూసీ ప్రక్షాళన
Telangana Assembly Sessions:మూసీ నది(Musi River)కి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) స్పష్టం చేశారు. ఒక పద్దతి, ప్రణాళిక బద్దంగా మూసి ప్రక్షాళన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారని, వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈసా, మూసా నదులను గోదావరి నీటితో నింపుతామన్నారు. రెండేళ్లలో గండిపేటను గోదావరి నీళ్లతో నింపుతామని స్పష్టం చేశారు.
గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని, ఆ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారని ఆరోపించారు. లక్షలు, కోట్లు ఖర్చు చేసి తనపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారని, అయినా భయపడలేదని రేవంత్ స్పష్టం చేశారు. గుజరాత్ లో సబర్మతి ప్రాజెక్టు చేపట్టి 60 వేల కుటుంబాలను తరలించారు.. యూపీలో గంగా ప్రక్షాళన చేశారు.. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. మూసీ వల్ల శిక్ష అనుభవిస్తుంది నల్గొండ ప్రజలు అని అన్నారు.
వచ్చే మూడు నెలల్లో 21 కిలోమీటర్ల ప్రక్షాళన అంచనాలు ఫైనల్ చేస్తామని పేర్కొన్నారు. ఏడీబీ బ్యాంక్.. రూ.4100 కోట్లు రుణం ఇస్తుంది.. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.. మూసీ ప్రక్షాళనకు ఎంత అవుతుందనే ఇప్పుడే చెప్పలేమన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు ఇస్తామని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలకు ఇండ్లు నిర్మిస్తామంటే అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షనేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.