బీఆర్ఎస్ నేత‌ల హౌస్ అరెస్ట్‌

House arrest of BRS leaders:సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌ను ముంద‌స్తుగా హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna)తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు రాత్రి నుంచి గస్తీ కాస్తున్నారు. బయటకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తపడ్డారు. పలువురిని రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు రావడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతుల‌కు 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో… బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టార‌ని తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

బేల‌, జైన‌థ్, ఆదిలాబాద్ మండల నాయకులను అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాసలేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ రన్ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ గోడం నగేష్ రైతుల పట్ల కనీస అవగాహన లేకుండా ట్రయల్ రన్ అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు.

 

You might also like