మీనాక్షి నటరాజన్ కు బిగ్ షాక్
Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఆమె రాజ్యసభ నామినేషన్ని తిరస్కరించింది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ వేశారు. ఐతే.. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, తెలంగాణలో ఉన్న క్రిమినల్ కేసులను అఫిడ్విట్లో పేర్కొన లేదని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ వేశారు. ఐతే.. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసు విషయం కూడా దాచిపెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దాంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్లు తెలిసింది. ఐతే.. ఇలా జరుగుతుందని కాంగ్రెస్ అస్సలు ఊహించలేదు. ఇవాళ నామినేషన్ దాఖలుకు చివరి రోజు. మీనాక్షి చివరి రోజున నామినేషన్ వేశారు. ఇవాళ స్క్రూటినీలో బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును ఈసీ పరిశీలించింది.
మధ్యప్రదేశ్లోని మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి ఒక్క సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. మీనాక్షి నటరాజన్ను ఆ స్థానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది. కానీ, అనూహ్యంగా ఆమె నామినేషన్ను ఈసీ తిరస్కరించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ స్పందించారు. దీనిని తాము కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఓటమికి భయపడి నామినేషన్ తిరస్కరించారని, నోటీసు ఇస్తే సమాధానం ఇచ్చేవాళ్లమని అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలకు బీజేపీకి 164, కాంగ్రెస్కు 62 మంది ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్కు అనర్హులయ్యారు. రాజ్యసభకు పోటీచేసే ప్రతి అభ్యర్థి 58 ఓట్లను కచ్చితంగా సాధించాలి. ఆ లెక్కన బీజేపీ 116 ఓట్లతో రెండు సీట్లను సులువుగా గెలుస్తుంది. ఇంకా ఆ పార్టీకి 48 ఓట్లు మిగులుతాయి. మూడో సీటు దక్కించుకోవాలంటే మరో 10 ఓట్లు సంపాదించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఆసక్తికరంగా మారింది.