ఉద్రిక్తత నడుమ ఎంపీ పర్యటన
ఎంపీ వంశీకృష్ణ పర్యటన రాజకీయ వేడిని రగిలించింది. ఒకవైపు కాంగ్రెస్ నేతల అసంతృప్తి, ఎంపీ ఫ్లెక్సీల చించివేతతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎంపీ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గూడెం పర్యటించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు వర్గం అయన పర్యటన వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎంపీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఈ రాజకీయ పరిణామాల మధ్య గూడెం ప్రభుత్వ పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ 160 మంది విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చొని చదువుతున్న విషయాన్ని గమనించిన ఎంపీ, అవసరమైన బెంచీలను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు తన వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.