జీవగంజి పోసిన వర్షం

కొద్ది రోజులుగా వర్షాలు లేక అల్లాడిపోయిన రైతులకు ఎట్టకేలకు ప్రకృతి కరుణించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం పత్తి, సోయాబీన్ పంటలకు కొత్త ఊపిరినిచ్చింది. ఎండిపోతున్న పంటలు కోలుకునే పరిస్థితి కనిపించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి, సోయాబీన్ పంటలు నేలలో తేమ లేక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పంటలను ఎలా కాపాడుకోవాలా అనే ఆందోళన రైతులను వెంటాడింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. గ్రామాల్లో కప్ప తల్లి ఆటలు, పూజలు జరిగాయి.

ఇలాంటి సమయంలో గత రాత్రి కురిసిన వర్షం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. వర్షంతో పొలాల్లో తేమ పెరగడంతో వాడిపోతున్న పంటలు మళ్లీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్లు, మోటార్ల ద్వారా నీరు అందించేందుకు చేసిన అదనపు ఖర్చు కూడా కొంత మేర తగ్గనుందని రైతులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 63.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 27.5 మిల్లీమీటర్లు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో 27.3 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ వర్షంతో పత్తి, సోయాబీన్ పంటలకు తగినంత తేమ అందిందని రైతులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో వర్షాలు కురిస్తే పంటల ఎదుగుదలతో పాటు దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన ఈ వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. అయితే వ్యవసాయానికి మరికొన్ని విడతల వర్షాలు అవసరమని రైతులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు అనుకూలిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌లో మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం రైతులకు ఊరటనిచ్చినా, రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో వర్షాలు కురవాలని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

భారీ వర్షాలు కురిసి వరదలు వస్తేనే చెరువు లు కుంటలు, ప్రాజెక్టు లు నిండే అవకాశం ఉంటది.అలా వర్షాలు పడాలని ఆశిద్దాం..అన్నదాతకు ఆపరావొద్దని కోరుకుందాం..

Get real time updates directly on you device, subscribe now.

You might also like