ఐటీఐలో 18న మెగా జాబ్ మేళా.. 1,147 ఉద్యోగ, అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీ
ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 18న మెగా అప్రెంటిస్షిప్/జాబ్ మేళా-2026 నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళాలో ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఉద్యోగ, అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించనున్నారు.
ఈ మేళాలో దేవాపూర్కు చెందిన ఓరియంట్ సిమెంట్స్ (అదానీ గ్రూప్), హైదరాబాద్కు చెందిన ఎల్అండ్టీ, టాటా ఏరోస్పేస్, ఎంటీఏఆర్, స్నైడర్ ఎలక్ట్రికల్, మేధా సర్వో, ప్రీమియర్ ఎనర్జీస్, ఐటీసీ తదితర 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 1,147 ఉద్యోగ, అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.19 వేల వరకు వేతనం లేదా స్టైఫండ్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, సీఎన్సీ మెషిన్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎంఎంవీ, డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్, కోపా తదితర ట్రేడ్లలో అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. కోపా ట్రేడ్లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
మేళా ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. అభ్యర్థులు రెజ్యూమ్/బయోడేటా, అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ కాపీ, ఎస్సెస్సీ, ఐటీఐ మార్కుల మెమోలు, ఎన్టీసీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.
అర్హత కలిగిన ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ఇతర వివరాలకు 9849389325 నంబర్ను సంప్రదించవచ్చు.