అరుదైన చికిత్స… చిన్నారికి పునర్జన

మంచిర్యాల : కొన ఊపిరితో ఉన్న పాపకు అరుదైన చికిత్స అందించి కాపాడారు మంచిర్యాల వైద్యులు ప్రయాణంలోనే ప్రాణాలు పోవాల్సిన చిన్నారికి వైద్యం అందించి శభాష్ అనిపించుకుంటున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న మహమ్మద్ రిఫిక్ కుటుంబం ఢిల్లీ నుండి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. రైలులో బెల్లంపల్లి పరిసర ప్రాంతానికి చేరుకోగానే పాపలో ఒక్కసారిగా చలనం ఆగిపోయింది . దీంతో మంచిర్యాలలోని శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రికి తరలించారు.
పాపని గమనించిన డాక్టర్ కుమార్ వర్మ పాపకి ABG పరీక్ష నిర్వహించారు. శరీరానికి అవసరమైన బైకార్బోనేట్ రసాయనం పాప శరీరంలో లేదని గుర్తించి.. దానికి సంబంధించిన చికిత్స అందించారు. దానితో పాటు పాప లో తక్కువస్థాయిలో ఉన్న బిపిని గుండె కొట్టుకునే వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యంలో చాలా అరుదుగా ఉపయోగించే ఔషధం వినియోగించి పాపను సాధారణ స్థాయికి తీసుకువచ్చారు.
పది రోజుల చికిత్స తరువాత పాప ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడి సాధారణస్థితికి వచ్చింది. దీంతో పాపన ఆదివారం పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. పరిస్థితి చేజారిపోయిన సమయంలో ఆపాపను కాపాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శ్రీ మహాలక్ష్మి వైద్యులు డాక్టర్ కుమార్ వర్మ తెలిపారు. ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆమెకు వైద్యం అందించి బతికించుకోగలిగామన్నారు. ఈ సందర్బంగా పాప తండ్రి మహమ్మెద్ రఫీక్ మాట్లాడుతూ చనిపోయినదనుకున్న తమ పాపని డాక్టర్ దేవుడి రూపంలో కాపాడారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.