సింగరేణిని కాపాడుకునేందుకు పోరాటం

హైదరాబాద్ : సింగరేణిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆయన తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారంగా ఉన్న సింగరేణి థ లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపుతోందన్నారు. లాభాల్లో ఉన్న సంస్థను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమ్మేయాలని కుట్ర పన్నడం అమానుషమని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నీచాతి నీచ చర్యలు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని వెల్లడించారు. సింగరేణి కార్మిక కుటుంబాలతో కలిసి ఉద్యమం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. లాభాలలో నడిచే సంస్థ లను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. ఎంఎండీఆర్ యాక్ట్ ని తీసుకొచ్చి కేంద్రం సింగరేణికి ఉన్న హక్కులను హరిస్తోందన్నారు. బొగ్గు బ్లాకులను ప్రయివేటు పరం చేయొద్దని 2015 లో 2021 లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ సంస్థ కోసం పోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును టీఆర్ ఎస్ పార్టీ ఖండిస్తున్నదన్నారు. కేంద్రం వైఖరి పట్ల ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతమైన పురోగతి సాధిస్తున్న ఈ సంస్థను నాశనం చేయాలని భావిస్తున్నదని దుయ్యబట్టారు. ఈ సంస్థను మోడీ తన దోస్తులకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సంస్థలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి చేపట్టామన్నారు. బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అయితే వారసత్వ ఉద్యోగాలు కొనసాగనివ్వరని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉదృతంగా పోరాడుతామని స్పష్టం చేశారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామన్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో..? సమాధానం చెప్పాలని…? ఆయన ప్రశ్నించారు. వీళ్ళ కు ఓట్ల రాజకీయం తప్ప ఇక్కడి ప్రజల సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు..? సమాధానం చెప్పాలని నిలదీశారు. సింగరేణి సంస్థ కు జరుగుతున్న కుట్రలో నోరు మెదపని బిజెపి నాయకులను బట్టలుడదీసి కొట్టాలన్నారు. సింగరేణి ని బతికించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తామని, అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు.
గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణి మీద దురుద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రయివేట్ పరం చేస్తున్న బిజెపి వైఖరిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తెలంగాణ పై వివక్ష మరోసారి కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వక పొగా ఇప్పుడు సింగరేణి సంస్థని నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కేంద్రం దిగివచ్చేవరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు.