సింగరేణిలో ఎగిరేది గులాబీ జెండానే
-తుప్పు పట్టిన సంఘాలు చెప్పే మాటలు కార్మికులు నమ్మరు
-భూపాలపల్లిలో వర్కింగ్ కమిటీ సమావేశం
-నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసిన కేంద్ర కమిటీ
-గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలో వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్లమల్లయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనని అనేక హక్కులు, సంక్షేమ పథకాలు సింగరేణి కార్మికులకు అందించినట్లు వెల్లడించారు.
కోల్ ఇండియాలో లేని విధంగా కారుణ్య నియామాకల పేరిట ఉద్యోగాలు ఇస్తున్న ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానిదేనని స్పష్టం చేశారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల గృహ రుణానికి వడ్డీ చెల్లింపు, 190/ 240 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ కార్మికులను రెగ్యులరైజ్ చేసి జనరల్ మజ్జూర్ క్రమబద్దీకరణ తమ హయాంలోనే జరిగాయన్నారు. వికలాంగులకు సర్ఫేస్ లో ఉద్యోగ అవకాశం, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే 3800 మంది పైగా నూతన ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని గుర్తు చేశారు.
ఇరవైకి పైగా కోల్ ఇండియాలో లేని హక్కులు, అరవైకి పైగా సింగరేణిలో నూతన హక్కులను ఎటువంటి పోరాటం లేకుండా సాధించిన ఘనత కీర్తి తమదేనన్నారు. కొన్ని కాలం చెల్లిన కార్మిక సంఘాలు టీబీజీకేఎస్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాయన్నారు. అటువంటి తుప్పు పట్టిన సంఘాలు చెప్పే మాయమాటలు నమ్మే స్థితిలో కార్మికవర్గం లేదన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సునాయాసంగా ఎదుర్కొని 11 ఏరియాలలో టీబీజీకేఎస్ గులాబీ జెండాను ఎగరవేయడం ఖాయమని మరోమారు స్పష్టం చేశారు.