పోరాటం తప్ప మరో మార్గం లేదు
-కేసీఆర్ అవినీతిని అంతం చేయాలి
-సింగరేణిని కాపాడే దమ్ము బీఎంఎస్, బీజేపీ పార్టీకి మాత్రమే ఉంది
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల.కీర్తిరెడ్డి

సింగరేణిని కాపాడుకునేందుకు పోరాటం తప్ప మరోమార్గం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల.కీర్తిరెడ్డి స్పష్టం చేశారు. భూపాలపల్లి ఏరియాలో ఆందోళనలో భాగంగా కేటీకే1 ఇంక్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి ఉత్పత్తి సాధిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలు బకాయిలు పెట్టిందన్నారు. ట్రాన్స్కో, జెన్కోకు సంబంధించి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత సీఅండ్ఎండీ తీసుకోవాలన్నారు.
కార్మిక వర్గసమస్యలను పరిష్కరించకుండా కేసీఆర్ ఆయన వ్యక్తిగత అవసరాల కోసం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని కీర్తిరెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అర్ధం చేరుకోవాలని కోరారు. కేసీఆర్ అనుబంధ అవినీతి సంఘం నాయకత్వంలో సింగరేణిని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని.ఉపాధి కల్పిస్తున్నసింగరేణి సంస్థ ఆస్తులను చెరబడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి కార్మికులే గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకోవడటానికి మరో కార్మికోద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ సందర్బంగా వెల్లడించారు. సింగరేణిలో అవినీతిపై జరుగుతున్న పోరాటంలో కార్మిక వర్గం ఐక్యతతో BMSతో కలిసి ముందుకు రావాలని కార్మికులకు పిలుపు నిచ్చారు.
కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, రేపటి భావితరాల భవిష్యత్తు కోసం BMS పోరాడుతుందని హామీ ఇచ్చారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న యూనియన్ BMS మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు బ్లాకుల కుంభకోణం, కార్మికుల ప్రావిడెంట్ ఫండ్లో జరిగిన రూ.1300 కోట్ల కుంభకోణం, సింగరేణిలో జరిగిన డీజిల్ కుంభకోణం, ఓపెన్ కాస్టులలో జరుగుతున్న కుంభకోణం, సింగరేణి కోనుగోళ్లలో జరుగుతున్న కుంభకోణం, CSR నిధుల మళ్లింపుతో జరుగుతున్న కుంభకోణం… ఇలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను అంతం చేసే పోరాటం చేసే దమ్ము ఉన్న BMS యూనియన్ వెంట కార్మికుల నడవాలని కీర్తి రెడ్డి కార్మికులను కోరారు.
ఏరియా ఉపాధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీకే 1 ఉన్న కార్మికుల సమస్యలపై యాక్టింగ్ మేనేజర్ పాండేకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ఓరం లక్ష్మణ్, బ్రాంచి కార్యదర్శి సుజేందర్, పిట్ కార్యదర్శి కే.భాస్కర్, గట్లమల్లారెడ్డి, అల్లం శ్రీనివాస్, జనార్దన్, లాక్ పతి, రఘుపతి రెడ్డి, తాండ్ర మొగిలి, మోరం లక్ష్మణ్, బందెల జనార్దన్, మధుకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.