ఇటు కర్రలు.. అటు చెప్పులు…
-టీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పర దాడులు
-మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

మంచిర్యాల పట్ణణం ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కలుగచేసుకుని శాంతింపచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మంచిర్యాల జిల్లా కేంద్రలోని ఐబీలో వరద బాధతులను ఆదుకోవాలని, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్ చేస్తూ ఐబీ చౌరస్తాలో భారతీయ జనతాపార్టీ మౌనదీక్ష చేపట్టింది. పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు ఓకే చోట నిర్వహించారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యతిరేక పార్టీలకు సంబంధించి నినాదాలు చేసుకోవడంతో గొడవ ప్రారంభం అయ్యింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం కర్రలు, చెప్పులతో దాడులు చేసుకున్నారు. తాము శాంతియుతంగా మౌనదీక్ష చేస్తుంటే టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడి చేశాయని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విజిత్ దాడి చేశారని. ఎమ్మెల్యే టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చ గొట్టారని ఆరోపించారు.