తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. సభలో ప్రజా సమస్యల చర్చ కన్నా, నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన, మరోవైపు స్పీకర్పై ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఆగ్రహావేశాలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన తాజా పరిణామాలివే…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్ గా మొదలైంది. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణమని…. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారని…. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారని…. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారని… అసెంబ్లీ కౌరవసభగా మారిందంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు. నా సంగంతేంటంటూ ప్రశ్నించారాయ. నీ తల్లిని అనలేదు హరీష్ నా తల్లిని అన్నారంటూ సీరియస్ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యుల తీరు స్పీకర్ ను బెదిరించేలా ఉందన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదన్నారు.. స్పీకర్ పై బెదిరింపు ధోరణితో సభ నడవదని గుర్తించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. సభను ఎలా నడపాలో మీరు ఎలా చెబుతారు..? అంటూ శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మహిళా సభ్యుల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు..
బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే వ్యక్తిగతంగా తమకు గౌరవం ఉందన్నారు. స్పీకర్ ను బీఆర్ఎస్ గౌరవిస్తుంది. స్పీకర్ ను ఉద్దేశించి అనలేదని తాతా మధు చెప్పారని గుర్తు చేశారు. ఆయనపై కేసులు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారంటూ ప్రశ్నించారు. సభ గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమయ్యింది…
మొత్తానికి అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఈ అగాధం సభా నిర్వహణను సవాల్గా మారుస్తోంది. ప్రజా సమస్యలపై జరగాల్సిన కీలక చర్చలు ఇలా రాజకీయ వాగ్వాదాలు, వాయిదాల పర్వంతో పక్కదారి పడుతుండటం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ రాజకీయ రగడ సభ వెలుపల ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.