తిరుపతి ప్రయాణం మరింత భారం

Tirupati :తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా..? తెలంగాణ ఆర్టీసీ ద్వారా వెళ్లాలనుకుంటే మోత మోగినట్లే… ఎందుకంటే, హైదరాబాద్-తిరుపతి రూట్లలో ఇక నుంచి డైనమిక్ టికెట్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి వెళ్లాలనుకున్న వారికి ఆర్థిక భారం తప్పదు.
ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ.. అందులో భాగంగా ఇప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, తిరుపతి మధ్య తిరిగే బస్సుల్లో కూడా డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దీంతో తిరుపతి వెళ్లే బస్సుల్లో టికెట్ ఛార్జీలు మరింతగా పెరగనున్నాయి. రోజూ హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల దర్శనానికి వెళ్తుంటారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే బస్సులు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తాయి. ప్రయాణికుల డిమాండ్ సాధారణంగానే ఈ మార్గాల్లో ఎక్కువగా ఉంటుంది గనుక టికెట్ ధరలు పెరుగుతూ ఉంటాయి.
డైనమిక్ ప్రైసింగ్ వల్ల ప్రయాణికుల డిమాండ్, సీట్ల ఆక్యుపెన్సీని, టికెట్లు బుక్ అవుతున్న కొద్ది ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీని వల్ల ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే విజయవాడ, బెంగళూరుతో పాటు పలు రూట్లలో డైనమిక్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఇలా ఛార్జీలు పెంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.