గృహలక్ష్మి పథకానికి గడువు లేదు

TS Gruha Lakshmi:సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందన్న వార్తల నేపథ్యంలో మంత్రి స్పందించారు.
ఇళ్లు లేని నిరుపేదల కోసం సొంతంగా ఖాళీ స్థలం ఉంటే వారికి ఇల్లు కట్టు కోవడానికి రూ. 3లక్షలు ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు. గ్రామ కంఠంలో పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ ఉన్నా, ఖాళీ స్థలం ఉన్నా సరే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చన్నారు.
తెలంగాణలో ప్రతి నియోజక వర్గానికి మొదటి దశలో 3వేల ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన పని లేదని, దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారని చెప్పారు. ప్రతి పక్షాలతో పాటు కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.