ప్రభుత్వ భూములు అమ్ముకుంటం… అవకాశం ఇవ్వండి

Telangana: సర్పంచ్ లకు ప్రభుత్వ భూములు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని కుభీర్ మండలం సిర్పెల్లి (హెచ్) సర్పంచ్ రాజేందర్ విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకునే అవకాశం సర్పంచ్ లకు కల్పించాలని డిమాండ్ చేశారు. మండల పరిషత్ సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి సక్రమంగా నిధులు కేటాయించడం లేదని, కనీసం ఎస్ఎఫ్సీ నిధులు కుడా రావడం లేదని మండిపడ్డారు. నాలుగున్నర సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్ లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ నెల పంచాయతీ నిర్వాహణ ట్రాక్టరు మెయింటెనెన్స్, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని మండి పడ్డారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం కోకాపేట భూములను అమ్ముతున్న మాదిరిగానే తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం సైతం అందజేశారు.