NIA ఆకస్మిక దాడులు

NIA surprise raids: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో NIA ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన NIA తనిఖీలు చేస్తోంది. ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మానవహక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న కొందరిపై ఎన్ఐఏ నిఘా పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు, న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో సోదాలు చేపట్టారు. విద్యానగర్లో అడ్వొకేట్ సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.
నెల్లూరులోనూ ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉస్మాన్ సాహెబ్పేటలోని ఏపీసీఎల్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఎల్లంకి వెంకటేశ్వర్లు రెండు దశాబ్దాలుగా పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.టీ. రాజారావు నివాసంలో ఎన్ఐఏ బృందం సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 5 గంటలకే తనిఖీలు ప్రారంభించారు. రాజారావు ఇంటితో పాటూ ఆయన ఆసుపత్రి పరిసరాల్లో ప్రత్యేక బలగాలను భారీగా మోహరించారు.
.